డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ముఖ్యమైన బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జనన మరణ డేటాబేస్ ద్వారా జాతీయ జనాభా రిజిస్టర్ (NPR) నవీకరణను అనుమతించడానికి ప్రభుత్వం ఒక బిల్లును తీసుకురావచ్చు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జనన మరియు మరణ డేటాబేస్ ను నిర్వహించడానికి, NPRని నవీకరించడానికి బిల్లు అనుమతిస్తుంది.
జనన మరణాల నమోదు (RBD) చట్టం, 1969ని సవరించే ముసాయిదా బిల్లును ప్రజల అభిప్రాయాలు, సూచనల కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఏడాది అక్టోబర్లో జారీ చేసింది. ప్రతిపాదిత బిల్లు ప్రకారం, ఎలక్టోరల్ రోల్స్, ఆధార్ డేటాబేస్, రేషన్ కార్డులు, పాస్పోర్ట్లు మరియు డ్రైవింగ్ లైసెన్స్లను నవీకరించడానికి కూడా డేటా ఉపయోగిస్తారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది.
డిసెంబర్ 6వ తేదీన అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరగనుంది. దీనిలో సభాకార్యక్రమాలు, ముఖ్యమైన అంశాలు చర్చిస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్సభ, రాజ్యసభల్లోని రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపారు. పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ 29న ముగుస్తాయి. ఈ మేరకు లోక్సభ, రాజ్యసభలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేశాయి.
వచ్చే నెలలో జి20 అధ్యక్ష పదవిని భారత్ చేపట్టనుంది. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్లో అన్ని రాజకీయ పార్టీల అధినేతల సమావేశానికి ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో జీ20 అధ్యక్ష పదవిని చేపట్టేందుకు భారత్ వ్యూహాన్ని ప్రభుత్వం రాజకీయ పార్టీలకు తెలియజేస్తుంది. ఈ ప్రత్యేక సమావేశానికి హాజరు కావాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఆహ్వాన లేఖలు పంపారు. ఈ సమావేశానికి ప్రభుత్వం తరపున ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్, రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరుకానున్నారు.