ఎన్ పి ఆర్ (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) నిరవధికంగా వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 లోపు దేశవ్యాప్తంగా దీన్ని చేపట్టాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా ఎన్ పి ఆర్ ను నిరవధికంగా వాయిదా వేశారు.
కరోనా నేపథ్యంలో ఇప్పుడు జనాభా లెక్కలను తీయాల్సిన అవసరం కూడా కనిపించడం లేదని సంబంధిత అధికారులు అంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కరోనా వైరస్ కు సంబంధించిన కార్యక్రమాలలో బిజీగా ఉన్నందున జనాభా లెక్కలను ఇప్పుడు తీయడం సాధ్యం అయ్యే పని కాదని సంబంధిత అధికారులు అంటున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమంగా జనాభా లెక్కల సేకరణ మన దేశంలో జరుగుతుంది. 2021 నాటికి జనాభా లెక్కలు సిద్ధం కావాల్సి ఉండగా అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. కొద్ది కాలం కిందట ఎన్ పి ఆర్ పై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగిన విషయం గుర్తుండే ఉంటుంది.