పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పెద్ద మక్కెన గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావుల విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గానికి కోడెల శివప్రసాద్ రావు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. కోడెల చేసిన అభివృద్ధి తప్ప నరసరావుపేట అభివృద్ధికి వైసీపీ ఎమ్మెల్యే చేసిందేమీ లేదని విమర్శించారు. త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉన్న శైవ దేవాలయాల్లో కోటప్పకొండ ఒకటిగా కోడెల గుర్తింపు తెచ్చారన్నారు. నరసరావుపేట నియోజకవర్గాన్ని,త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని కోడెల అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాను అభివృద్ధి చేశానని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అక్రమ అరెస్టులు,అబద్ధపు అవినీతి ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం,పోలీసులు కలిసి కోడెలను ఆత్మక్షోభకు గురి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించారని మండి పడ్డారు. తాను కోడెల ప్రోత్సాహంతోనే నరసరావుపేట రాజకీయాల్లోకి వచ్చానని డా౹౹కోడెలల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో నారా రోహిత్, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు,వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీ.వి ఆంజనేయులు,కోడెల శివరాం,కోడెల కుటుంబ సభ్యులు,టీడీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.