కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తక్షణమే మూడు వేల నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చెయ్యాలని తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం తమ డిమాండ్ ను అంగీకరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి నేడు నిరసన తెలుపుతూ విధులు నిర్వహించారు.
కోర్ట్ కేసులు పరిష్కరించి వెంటనే ఖాళీలు భర్తీ చేయాలని వారు కోరారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నియమించే నర్సులను ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ విధానంలో భర్తీ చెయ్యాలని వారు డిమాండ్ చేశారు.
ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (తెలంగాణ రాష్ట్ర శాఖ ) రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( ప్రభుత్వ ఉద్యోగుల సంఘం) నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు ఇచ్చిన పిలుపును అందుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసినట్లు సలహాదారులు చిలుపూరి వీరాచారి, ప్రెసిడెంట్ శ్రీను రాథోడ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ , కోశాధికారి వంశీ ప్రసాద్, ట్రైన్డ్ నర్సస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ రాజేశ్వరి, రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుజాత తెలిపారు.
తాత్కాలికంగా నియమించే పోస్టులలో జాయిన్ అవ్వరాదని వారు పిలుపునిచ్చారు. హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్పై ప్రభుత్వం చొరవ తీసుకుని 3,311 నర్సు పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
కరోనా పై యుద్ధం లో అమరుడైన డాక్టర్ నరేష్ కు, నర్సింగ్ ఆఫీసర్ జయమణి కి అశ్రునివాళి ఘటించారు. వారి కుటుంబాటకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.