జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురు వచ్చినా అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, అదేవిధంగా చదువు పట్ల అత్యంత శ్రద్ధ కనబరచాలని ములుగు నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్ సీతక్క పిలుపునిచ్చారు. శుక్రవారం జీవంతరావుపల్లిలోని ఆదర్శ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం ముగింపు సభలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ చాలెంజ్ గా తీసుకొని చదువుని ఆసరాగా చేసుకుని అన్నింటినీ అధిగమించాలని పేర్కొన్నారు. విద్యార్థి జీవితంలో ఉండే సమస్యల పరిష్కారాలకు కృషి చేసే విధంగా విద్యార్థి దశలోనే అలవాటు చేసుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే చదువు అనేది అత్యంత ఆవశ్యకమని, అందుకని దానిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదని సూచించారు. వేదిక పైన ఎంతోమంది శాస్త్రవేత్తల చిత్రపటాలు ఉన్నాయని వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని, కష్టపడి భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదిగే విధంగా ప్రతి విద్యార్థి నిత్యం నేర్చుకునే అలవాటు చేసుకోవాలని కోరారు. ములుగు ప్రాంతం వెనుకబడిన జిల్లా అయినప్పటికీ అందరం కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. ఓటమిని విజయానికి తొలిమెట్టుగా భావించి భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలకు ఇంకాస్త సన్నద్ధం కావాలని తెలిపారు.
జిల్లా స్థాయిలో ప్రదర్శించబడిన 260 సైన్స్ ఎగ్జిబిట్లు అత్యంత అద్భుతంగా ఉన్నాయని, ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన విద్యార్థులను, గైడ్ టీచర్లను ఆమె అభినందించారు, ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణిని, జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు సాంబయ్య, రమాదేవి, సహాయ సమన్వయకులు అర్షం రాజు, స్థానిక పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి, వివిధ మండలాల మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.