కమిషన్లకు కక్కుర్తి పడి అధికారులు నిబంధనలను గాలికి వదిలి వేయటం వల్లనే నిన్న సింగరేణి ఓపెన్ కాస్టు గనిలో ప్రమాదం జరిగిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అధికార పార్టీ నేతలు సింగరేణిలో ఓబీ పనుల్లో బినామీలతో కాంట్రాక్టు చేయిస్తున్నారని ఆయన అన్నారు.
సింగరేణి రామగుండం ఓపెన్ కాస్ట్ గని లో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించిన విషయం తెలిసిందే ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోల్ మైన్స్ సేఫ్టీ అధికారులు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో అధికారులకు అక్షయ పాత్రగా ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టర్లు మారిపోయారని ఆయన అన్నారు. కాంట్రాక్టు కేటాయించి పనులపై పర్యవేక్షణ పట్టించుకోని సింగరేణి అధికారులదే ఈ వైఫల్యమని ఆయన అన్నారు. మృతి చెందిన కుటుంబాలకు కంపనీ లో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.