ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి, నిమజ్జనం ఉత్సవాలను నిర్వహించుకోవడానికి సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ ఆదేశించారు.
బుధవారం రాజస్వ మండల అధికారి-వనపర్తి ఆర్డీవో సమావేశ మందిరంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులు, శాంతి కమిటీలతో జిల్లా అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ని జరుపుకోవాలని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని ఆయన సూచించారు. భక్తులు అందరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, శాంతి కమిటీల సభ్యులు అందరూ మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహించాలని అన్నారు.
గణేష్ మండపాలలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో ఇటీవల భారీ వర్షాలకు అన్ని చెరువులు, కుంటలు నీటితో నిండాయని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిమజ్జన పాయింట్ లో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్య శాఖ అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించారు.
సరిపోను క్రేన్లను ఉంచాలని, శానిటేషన్ పకడ్బందీగా నిర్వహించాలని, అన్ని గణేష్ మండలి వద్ద పోలీసు పెట్రోలింగ్ పకడ్బందీగా అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వినాయకుల నిమజ్జనానికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు ప్రణాళికాబద్ధంగా చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి తహశీల్దార్ రాజేందర్ గౌడ్,వనపర్తి పోలీస్ సీఐ ప్రవీణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, శాంతి కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్