కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన దళితదండు
కొల్లాపూర్ నియోజకవర్గంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, అయితే బాధితులు ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని తెలంగాణ దళిత దండు వ్యవస్థాపక అధ్యక్షుడు బచ్చలకూర బాలరాజు ఆరోపించారు.
కొల్లాపూర్ పట్టణం సమీపంలోని రామాపురం వద్ద నిర్మించిన ఆసుపత్రి ఆకస్మిక తనిఖీకి వచ్చిన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ కు ఈ మేరకు ఆయన ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు ఇచ్చినా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంలో ఉన్నతాధికారులు తాత్సారం చేస్తున్నారని బాలరాజు అన్నారు.
బాధితులు పలుమార్లు కోరిన తర్వాత ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ఆసుపత్రి నిర్మాణం కోసం భూమి కోల్పోయిన వారికి ఇదే ఆసుపత్రిలో ఉద్యోగ అవకాశం కల్పించాలని కూడా ఆయన కోరారు.
గతంలో ప్రభుత్వ ఆసుపత్రి కొరకు 113సర్వే నెంబర్ లో 50పడకల,100పడకల ఆసుపత్రి కొరకు రైతులతో భూములు తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో అప్పటి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి, నేటి మాజీ మత్రి జూపల్లి కృష్ణారావు భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారాన్ని ప్రభుత్వంచే ఇప్పిస్తానన్నారు.
అయితే ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం తీర్మానం చేసింది. కానీ రైతులకు నష్టరిహారాన్ని ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు మామిడి మార్కెట్ కోసం 12 ఎకరాలు సేకరించారు. వారికి కూడా నష్టపరిహారాన్ని ఇవ్వలేదు. నష్టపరిహారం అందే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. అదే ఆస్పత్రిలో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగం కల్పించాలని కూడా వినతిపత్రం సమర్పించారు.