నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో అధికారుల నిర్లక్ష్యంతోనే కల్వకుర్తి లో కోవిడ్-19 కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయని పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని పాలమూరు చౌరస్తాలో గల సాయి శ్రీనివాస వైద్య దుకాణం లో ఉన్న రెండవ యజమానికి గత నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది.
కేసు నమోదు కావడంతో వైద్యాధికారులు అప్రమత్తమై మెడికల్ షాప్ మూసివేయించారు. పాజిటివ్ గల వ్యక్తికి హోమ్ క్వారంటైన్ లో ఉంచి ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా బయటకు రావొద్దని సూచనలు కూడా జారీ చేసారు. ఇది ఇలా ఉండగానే గురువారం ఉదయం మెడికల్ షాపు మొదటి యజమాని తెరవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైమరీ కాంటాక్ట్ లనే వదిలివేస్తున్న వైనం
ప్రైమరీ కాంటాక్ట్ లో ఉండాల్సిన వారు స్వీయ నిర్బంధం వదిలి బయటకు రావడాన్ని వారి వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగించడానికి, ఓ పోలీసు ఉన్నతాధికారి అండదండల కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. మొదటి యజమాని రెండవ యజమాని ఇద్దరు సొంత అన్నదమ్ములు కావడం ఒకటే నివాసంలో అందరూ కలిసి ఉండటంతో వారి నుండి తమకు ఎక్కడ ఈ రోగం తమకు అంటుకుంటుందోనని నగరవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
కొన్ని కాలనీలలో ఓకే ఇంట్లో నివసిస్తున్న ఐదుగురికి ఆరుగురికి కుటుంబం మొత్తానికి పాజిటివ్ వస్తుండటంతో వీరి భయానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో గాంధీ నగర్ లో నివసిస్తున్న ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అతని ప్రైమరీ కాంట్రాక్ట్ విచారణలో ఈ మెడికల్ షాప్ లో మందులు కొన్నట్టు తెలిసినా ఉన్నత అధికారి ప్రోద్బలంతోనే ఆ వైద్య దుకాణం ప్రైమరీ కాంటాక్ట్ లో భాగంగా మూసి వేయకుండా ఉండటంతోనే తనకి పాజిటివ్ కేసు నమోదైందని మరల వీరినుండి ఇతరులకు సోకే ప్రమాదం లేకపోలేదని ప్రస్తుతం పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణ ప్రజల ప్రాణాలతో చెలగాటమేల?
ఫ్రెండ్లీ పోలీస్ ఉండాలి కానీ ఇటువంటి ఈ సమయంలో పట్టణ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడరాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పేదవాడి ప్రాణాలతో డబ్బు అధికార బలం ఉన్నవారు ఆడుకుంటున్నారని, చట్టం పేదోడికి ఒకలాగా ఉన్న వాడికి చుట్టం లాగా పనిచేస్తుందాఅని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు.
ఇట్టి విషయంపై మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ ను వివరణ కోరగా ప్రస్తుతం నెగిటివ్ వచ్చినందున దుకాణం తెరిచారేమోనని, సందేహ పూర్వకంగా వివరణ ఇవ్వగా ఏది ఏమైనా నా 15 రోజుల వరకు ప్రైమరీ కాంట్రాక్ట్ బయటకు రావొద్దు కదా చట్టం ఒకరికి ఒక లాగా మరొకరికి ఒక లాగా ఉందా ప్రశ్నించగా అలా ఏమీ లేదని దుకాణము మూసి వేయిస్తామని తెలిపారు.
అదేవిధంగా జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ ను వివరణ కోరగా అది పోలీసుల పని అని వారికి తెలుపుతానని సమాధానం ఇచ్చారు. కల్వకుర్తిలో ఇప్పటినుంచైనా అధికారుల పనితీరు మారాలని లేకుంటే కల్వకుర్తి లో కరోనా విజృంభణతో ఘోరాతి ఘోరమైన పాజిటివ్ కేసులు తో చాలా మరణాలు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.