కడప జిల్లా రాజంపేటలో వృద్ధాప్యపు పింఛన్లు తీసుకునే వారు నానా అగచాట్లు పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి సభకు వెళ్లి వచ్చిన వారికి పెన్షన్లు కట్ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను స్థానిక వైసిపి నాయకులు ఆపి పెట్టారు.
చంద్రబాబు సభ కు వెళ్లి వచ్చినందుకు ఇది మీకు బహుమతి అని చెబుతున్నారు. చంద్రబాబు మీటింగ్ కు వెళ్లి వచ్చారు కదా పెన్షన్లు ఆయననే అడగండి అంటున్నారని వృద్ధులు ఫిర్యాదు చేస్తున్నారు. కొందరు స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లి కార్జున రెడ్డిని కూడా కలిసి తమకు పెన్షన్లు ఇప్పించాల్సిందిగా కోరారట.
వెళ్లి చిన్నాయనను కలవండి అని ఆయన సలహా ఇచ్చారట. దాంతో ఎమ్మెల్యే చిన్న నాయన అయిన మేడా భాస్కరరెడ్డిని వారు వెళ్లి కలిశారు. అయితే ఆయన వారిని ఛీత్కరించుకుని పంపించారని అంటున్నారు. చంద్రబాబునాయుడి మీటింగ్ కు వెళ్లడం తప్పా అని వారు అడుగుతున్నారు.
అయితే అక్కడ మేడా వారి రాజ్యమే ఉన్నందున పైకి చెప్పడానికి కూడా భయపడుతున్నారు. నందలూరు మండలం మొత్తం ఈ వ్యవహారం తెలిసి పోవడంతో అధికారులు కూడా నిస్సహాయంగా ఉండిపోతున్నారు.