తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రొత్తగా వృద్ధాప్య,ఆసరా పింఛన్ల దరఖాస్తు గడువును మీ సేవ కేంద్రాలలో ఆగస్టు 31 వరకు మాత్రమే ప్రభుత్వం నిర్ణయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది 57 సంవత్సరాలు నిండిన అర్హులు వివిధ కారణాలతో గ్రామాల్లో,పట్టణాల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేక పోయారని సామాజిక కార్యకర్త షేక్ మన్సూర్ అలీ అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన పిదప మన్సూర్ అలి మాట్లాడుతూ నూతన ఆసరా పెన్షన్ల ధరఖాస్తులపై ప్రజలకు అవగాహన పూర్తి స్థాయిలో ప్రభుత్వం కల్పించ లేకపోవటంతో అనేక మంది వృద్ధులు,మహిళలు,నిరక్షరాస్యులు మారుమూల గ్రామాల్లో,తండాల్లో నివసిస్తోన్న పేదలు అర్హులుగా ఉండి కూడా మీ సేవ కేంద్రాలలో ధరఖాస్తులు చేసుకోలేకపోయారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 57 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించేందుకు సర్వే చేపట్టగా 8 లక్షలకు పైగా అర్హులు రాష్ట్రంలో ఉన్నట్లు వెల్లడైనా దరఖాస్తులు మాత్రం 7.3 లక్షల మంది మాత్రమే చేసుకోగలిగారని,మిగిలిన అర్హులైన వారు దరఖాస్తు సమయం తక్కువగా ఉండటం,మీ సేవా కేంద్రాలు అందుబాటులో లేకపోవడం,ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళటం, ఆరోగ్యరీత్యా హాస్పిటల్స్ కు వెళ్ళటం వంటి వివిధ కారణాలతో ఆసరా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోలేకపోయారని అన్నారు.
అర్హులైన పేద వారి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో నూతన ఆసరా పెన్షన్ల గడువును పెంచి పెన్షన్ దారులకు న్యాయం చేయాలని హుజూర్నగర్ మున్సిపల్ కమీషనర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో వానరాశి సైదులు, పి.రాములు,ఎం.రాజబాబు,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్