పాత కడప సుందరీకరణ పనులకు సంబంధించి ఈ నెల చివరికల్లా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి త్వరలో పనులు ప్రారంభించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్బాష ఆదేశించారు.
ఆదివారం ఉప ముఖ్యమంత్రి నివాసం లో మాజీ మేయర్ సురేష్ బాబు తో కలిసి పాత కడప సుందరీకరణ పనులపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత కడప చెరువును హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఇందుకు 55 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అన్నారు. పాత కడప చెరువు బ్యూటిఫికేషన్ ఎంతో ముఖ్యమని, డిజైన్ ఎస్టిమేషన్ వేసి వెంటనే టెండర్లు పూర్తి చేయాలన్నారు.
చెరువు చుట్టుపక్కల పచ్చదనాన్ని పెంపొందించి ప్రజలకు ఆహ్లాద వాతావరణాన్ని కల్పించాలన్నారు. కడప నగర అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖుల విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కేసీ కెనాల్ ఈఈ ప్రతాప్, డీఈ బ్రహ్మారెడ్డి, ఏఈ పాల్ దీపక్, నగరపాలక సంస్థ ఎస్ ఈ సత్యనారాయణ, ఈఈ ధనలక్ష్మి, డీఈ తులసి కుమార్, ఏ ఈ అబ్దుల్, వైకాపా నాయకులు అజ్మతుల్లా, తదితరులు పాల్గొన్నారు.