24.7 C
Hyderabad
March 29, 2024 07: 23 AM
Slider అనంతపురం

పెనుకొండ ప్రాచీన శివాలయంలో  సంస్కృత శాసనం గుర్తింపు

#mynaswamy

విజయనగర సామ్రాజ్య పూర్వ రాజధాని నగరమైన పెనుకొండలోని ప్రాచీన శివాలయం ఐముక్తేశ్వర స్వామి గుడిలో ఒకటో దేవరాయకు చెందిన సంస్కృత శాసనాన్ని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి గుర్తించారు. ఐముక్తేశ్వరాలయాన్ని సందర్శించిన ఆయన రంగమండపం పైకప్పునకు వాడిన రాతిదూలoపై శాసనాలు చెక్కి వుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

పైకప్పు బండలపై, రాతి దూలాలపై శాసనాలు అరుదుగా వుంటాయి. ఐముక్తేశ్వరాలయం పైకప్పుపై గల సంస్కృత శాసనాలు అత్యంత అరుదైనవిగా చారిత్రక పరిశోధకుడు అభివర్ణించారు. ఎందుకంటే శాసన భాషతో పాటు లిపి కూడా “దేవనాగరి(సంస్కృతం భాషకు రాత)” వుండడం సాధారణ మైన విషయం కాదు. సుమారు 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడెల్పు వున్న రాతి దిమ్మెలపై ఒక్కోదానిపై 5 వరుసల్లో శాసనాలు రాశారు.

“దేవనాగరి” అక్షరాలు అందంగా, పదాలు పొందికగా వున్నట్టు మైనాస్వామి వివరించారు. ఆలయంలో తెలుగు, కన్నడ శాసనాలు కూడా వున్నా.. అవి చదవడానికి వీలుకానంతగా అక్షరాలు చెరిగిపోయాయి. సంస్కృత శాసనాలు మాత్రం భద్రంగా వున్నాయి. రెండో హరిహరరాయల కుమారుడైన ఒకటో దేవరాయలు (క్రీ.శ.1406-1422) విజయనగర రాజ్య చక్రవర్తి కాక మునుపు పెనుకొండ సీమకు రాజ ప్రతినిధిగా వ్యవహరించేవారు.

ఒకటో దేవరాయలు పెనుకొండలో వున్నట్టు ఆధారాలున్నాయి. విజయనగరాజ్య ఆవిర్భావ కాలానికి చెందిన ఐముక్తేశ్వరాలయాన్ని పునర్ నిర్మించి, శివలింగాన్ని పునః ప్రతిష్ఠ చేసి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు ఒకటోదేవరాయ, శాలివాహన శకవర్షం1328  పార్థివ నామసంవత్సరం ఫాల్గుణ మాసం లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గర్భగుడిలో శివలింగాన్ని పునః ప్రతిష్ఠ చేశారు.

శాసనాలు ఆ విషయాలను స్పష్టం చేస్తున్నాయి. పెనుకొండ సీమ రాజ ప్రతినిధిగా వ్యవహరించిన ఒకటో దేవరాయ తమ పట్టాభిషేకోత్సవానికి గుర్తుగా ఐముక్తేశ్వర గుడిని పునర్ నిర్మించి వుండవచ్చునని మైనాస్వామి తెలిపారు. ఇంగ్లీషు తేదీ ప్రకారం క్రీ.శ.1406 ఫిబ్రవరి 26 బుధవారం శివ లింగ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగి వుంటాయని పరిశోధకుడు పేర్కొన్నారు. విజయనగర సామ్రాజ్య కాలంలో కొన్ని సంస్కృత శాసనాలు న్నప్పటికీ .. అందులోని లిపి కన్నడ, తెలుగు. కానీ పెనుకొండలో మాత్రం లిపి దేవనాగరిలో వుండడం గమనించదగ్గ అంశం.” శ్రీగణాధి పతయే నమః” అని శాసనం మొదలవుతుంది.

కాగా చరిత్ర, శాసనాలు, భాషల గురించి పరిశోధించే వారికి ఇటువంటి శాసనాలు ఎంతో వుపయోగ పడతాయని, శాసనాలను పరిరక్షించిన వారు సమాజానికి మేలు చేసినవారని చారిత్రక పరిశోధకుడు చెప్పారు. ఎంతో చారిత్రక ప్రాముఖ్యం వున్న పెనుకొండ ఐముక్తేశ్వరాలయాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కేంద్ర పురాతత్వ శాఖ ముందుకు రావాలని మైనాస్వామి విజ్ఞప్తి చేశారు.

గర్భగుడి, అంతరాళం, ముఖమండపం, మహామండపం, రంగమండపం, యాగ మండపాలతో ముక్తేశ్వర సన్నిధి సంపూర్ణ గుడిగా భాసిల్లుతున్నది. గుడి గోపురం మరియు ప్రవేశం పడమర వైపున్నా, ఆలయం తూర్పునకు అభిముఖంగా వుంది. శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంది. విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన అరుదైన ఆలయాల్లో ఐముక్తేశ్వర సన్నిధి ఒకటి. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ వై రవిశంకర్ గురూజీ, సుధాకర్ గుప్తా,వేద, రామకృష్టప్ప, రమేష్, ప్రకాష్,గోవిందరాజులు, శుభాష్, సూర్యనారాయణ, గాయిత్రి తదితరులు పాల్గొన్నారు.

మైనాస్వామి సెల్ నెంబర్: 95026 59119

Related posts

తల్లి నీకు పాదాభివందనం

Satyam NEWS

జేఏసీ రిక్వెస్ట్: బంద్ కు సహకరించండి

Satyam NEWS

What next: అందమైన ఉక్రెయిన్ ఛిద్రం… ఆర్ధికంగా రష్యా పతనం

Satyam NEWS

Leave a Comment