తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్ లైన్ విద్యకు భారీ స్పందన లభించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా అన్ లైన్ విద్యను టి.సాట్ నెట్వర్క్ ఛానళ్ల ద్వార ప్రారంభించిన తెలంగాణ విద్యాశాఖ మంచి ఫలితాలను రాబట్టింది.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అన్ లైన్ పాఠాలు చూసినట్లు టిసాట్.టీవి యాప్ ద్వారా నిర్ధారణ అయింది. ప్రభుత్వం నిర్ణయించిన తేదీ, సమయం ప్రకారం మంగళవారం మూడవ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థుల వరకు మొదటి రోజు సుమారు ఆరు గంటల ఆన్ లైన్ పాఠాలు బోధన జరిగింది.
తొలి రోజే 11,73, 921 వ్యూస్, 1,56, 658 సబ్ స్ర్రైబ్స్ లభించాయి. ఒక్క రోజే భారీగా విద్యార్థుల నుండి స్పందన లభించడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులతో పాటు విద్యాశాఖలోనూ ఉత్సాహం నింపింది.
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యా శాఖ చేస్తున్న శ్రమకు మంచి ఆదరణ లభించడంతో ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు హర్షం వ్యక్తం చేస్తూ విద్యాశాఖను, ప్రసారాలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చిన టి.సాట్ ను అభినందించారు.