దాదాపు 17 సంవత్సరాల తర్వాత అమెరికాలో ఒక నేరస్తుడికి ఉరిశిక్ష అమలు జరిపారు. జాతి వివక్షతతో ముగ్గుర్ని చంపిన డానియల్ లూయిస్ లీ అనే శ్వేత జాతీయుడిని ఇండియానా స్టేట్ లోని టెర్రరే హ్యూట్ ఫెడరల్ జైలులో ఇంజెక్షన్ ఇచ్చి ఉరి శిక్ష అమలు చేశారు.
ప్రపంచం మొత్తం శ్వేత జాతీయులే ఉండాలని అనే నినాదంతో లూయిస్ లీ ముగ్గుర్ని హత్య చేశాడు. అయితే తాను ఈ హత్యలు చేయలేదని లూయిస్ లీ చెబుతున్నాడు. ఉరిశిక్ష అమలు చేసే సమయంలో కూడా తాను ఈ హత్యలు చేయలేదని, ఒక అమాయకుడికి ఉరిశిక్ష అమలు చేస్తున్నారని అతడు వాపోయాడు.
టెర్రరే హ్యూట్ ఫెడరల్ జైలులో ఉరిశిక్ష వేసే గదిలో లూయిస్ లీ ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి ముందుగా చేతికి ఆక్సిజన్ కొలిచే మీటర్ ను ఏర్పాటు చేశారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను గమనిస్తూ మరో చేతి నరాల్లోకి మందు ఎక్కించారు. శ్వాస వేగంగా పీల్చుకున్న లూయిస్ లీ కొద్ది సేపటికి తల పైకి ఎత్తి చూశాడు. వెనువెంటనే తల వాల్చేశాడు. అనంతరం వైద్యులు పరీక్షించి అతను మరణించినట్లు ధృవీకరించారు.
1995లో లూయిస్ లీ అర్కన్సాస్ ప్రాంతంలోని టిల్లే లోఉంటున్న విలియం ముల్లర్, ఆయన భార్య నాన్సీ 8 సంవత్సరాల కుమార్తె సారా పౌల్ లను అతి కిరాతకంగా చంపాడని ప్రాసిక్యూషన్ వాదన. తమ పేరు చెప్పి అతడిని ఉరివేయవద్దని విలియం ముల్లర్ బంధువులు చెప్పారు.
అతడికి ఉరి వేయడాన్ని తాము కూడా వ్యతిరేకిస్తున్నామని, అతడు జీవితాంతం జైలులో ఉంటే సరిపోతుందని వారు చెప్పారు. అయితే చట్ట ప్రకారం అతడికి ఉరి శిక్ష విధించారు.