ములుగు జిల్లాలో కూలి పనికి వెళ్లే మహిళలు ప్రయా నిస్తున్న ఆటో విద్యుత్ స్తంభానికి ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన 15 మంది మహిళలు ఆటోలో తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి వరి నాట్ల కోసం కూలికి వెళ్తున్నారు. నార్లాపూర్ గ్రామంలో కూలీలు వెళ్తున్న ఆటో అదుపుతప్పి కరెంటు పోల్కి ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళల్లో ముందు కూర్చున్న ఎల్ల బోయిన సునీత (35) ఘటనా స్థలంలోనే మృతి చెందగా బానోత్ జ్యోతి పరిస్థితి విషమంగా వుంది. మిగతా కూలీలలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు గాయపడిన వారిని 108కి సమాచారం అందించి, ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
previous post