పూటుగా తాగాడు… తాగినోడు నోరు మూసుకుని వెళ్లవచ్చు కదా? అతను అలా చేయలేదు. పక్కనున్నోడ్ని కెలికాడు. దాంతో అతడు గొడ్డలితో ఒక్క వేటు వేశాడు. ఇంకేముంది తాగినోడు పాపం అమరుడయ్యాడు. చిత్తూరుజిల్లా ములకలచెరువు మండలం కదిరి నాయిని కోటలో ఈ సంఘటన జరిగింది.
అదే గ్రామానికి చెందిన సాకల నారాయణ గ్రామ శివార్లలో కంప చెట్లు నరుకుతుండగా అటువైపు వెళుతున్న వెంకటరమణ మద్యం మత్తులో గొడవకు దిగాడు. వెంకటరమణ గత కొంత కాలంగా సాకల నారాయణను ఎలాగైనా చంపుతా అంటూ అందరితో చెబుతూ ఉండేవాడట.
వెంకటరమణ 2015లో తన భార్యను, ఆమె ప్రియుణ్ణి హత్య చేసి జైలుకు కూడా వెళ్లివచ్చాడు. వెంకటరమణ తనను రెచ్చగొడుతుంటే ముందుగా ఊరుకున్న నారాయణ ఆ తర్వాత కోపానికి వచ్చాడు. తన చేతిలోని గొడ్డలితో వెంకటరమణ నరకడం తో అతను అక్కడికక్కడే మరణించాడు.
విషయం తెలుసుకున్న ములకలచెరువు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాకల నారాయణ ను అదుపులోకి తీసుకున్నారు. ములకలచెరువు సి ఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.