ఈ రోజుల్లో కూడా మంత్రాలు చేయడం లాంటి పనులను నమ్ముతారా? ఇదుగో ఇక్కడ అలా నమ్మి ఒక నిండు ప్రాణం తీశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని బంధాల గ్రామపంచాయతీ పరిధిలోని బొల్లెపల్లి శివారు గ్రామంలో ఈ దారుణం జరిగింది
తోలెం విజయ్ కుమార్ (25) అనే యువకుణ్ణి మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో నిన్న రాత్రి దాదాపు 8 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన పూనెం సురేష్ గొడ్డలితో నరికి చంపాడు. తోలెం విజయ్ కుమార్ గత ఐదు సంవత్సరాలుగా కూలీ పనులకు వెళ్తుండేవాడు.
కూలిపనులు పూర్తి అయిన తర్వాత దేవుడు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామానికి గ్రామానికి చెందిన పూనేం సురేష్ (22) చెల్లెలు నీలవేణి 6 నెలల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
విజయ్ కుమార్ మంత్రాలు చేయడం వల్లే తన చెల్లెలు పురుగుల మందు తాగి చనిపోయిందనే మూఢనమ్మకంతో అనుమానం పెంచుకున్న సురేష్ నిన్నటి రోజున రాత్రి 8 గంటలకు గొడ్డలి పట్టుకుని మృతుడి ఇంటికి వెళ్ళి మృతుడితో గొడవపెట్టుకున్నాడు.
ఇంటి ముందు వాకిట్లోకి లాక్కొచ్చి మెడ వెనక భాగంలో, భుజం భాగంలో గొడ్డలితో నరికాడు. దాంతో తీవ్రమైన రక్తస్రావంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతుడు అవివాహితుడు, తల్లిదండ్రులు కాలం చేశారు. తోబుట్టువులెవరూ లేరు. మృతుడి పెద్దమ్మ పూనెం సారక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు పస్రా సీఐ అనుముల శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై సీఎచ్.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసుకొని సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు.
కేసును దర్యాప్తు చేస్తున్నారు.