పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఓటర్లకు అసౌకర్యం కలగకుండా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 341, పాలేరులో 280, మధిర లో 265, వైరా లో 243, సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో 287 మొత్తం 1416 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఆయన అన్నారు. ఓటరు 2 కి.మీ. లకు మించి దూరం వెళ్లకుండా పోలింగ్ కేంద్రం ఉండేలా చూడాలన్నారు
. ప్రతి గ్రామంలో ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. తహసీల్దార్, బిఎల్ఓ, అంగన్వాడీ టీచర్లతో సమావేశమై హేతుబద్దీకరణ పై ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ప్రి రివిజన్ కార్యకలాపాలు ఆగస్టు నుండి చేపడుతున్నట్లు ఆయన అన్నారు. నవంబర్ మాసం నుండి రివిజన్ కార్యకలాపాలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, డిఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఎస్డీసి, కలెక్టరేట్ ఎలక్షన్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.