ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ లేకపోవడంతో ఒక జర్నలిస్టు ఉసురు తీశారు. కరోనా బాధితులకు తగిన రీతిలో వైద్యం అందించడంలో విఫలమయిన ప్రభుత్వాసుపత్రి నిర్వాహకం ఇది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ లో టీవీ5 విలేకరిగా పదేళ్ల నుంచి పనిచేస్తన్న రాము(52) వారం రోజులుగా కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రాజమండ్రి జిల్లా ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు.
శ్వాస సమస్య తీవ్రం కావడంతో తల్లడిల్లిపోతున్న బాధితుడి గురించి స్థానిక విలేకరులు పదే పదే అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఆక్సిజన్ కొరత తీర్చడంలో విఫలమయ్యారు. ఆస్పత్రిలో అవసరమైన దానిలో 10శాతం కూడా సరఫరా చేయలేకపోయారు. దాంతో విలవిల్లాడుతూ తుదిశ్వాస విడిచే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఈ ఆస్పత్రిలో పదుల సంఖ్యలో బాధితులది ఇదే పరిస్థితి.