వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి జోక్యంతో ఒక దళిత యువకుడికి శిరోముండనం చేయించి పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా సీతానగరం పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న షేక్ ఫిరోజ్ షా అనే సబ్ సబ్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ అనే దళితుడిపట్ల అమానుషంగా ప్రవర్తించినట్లు పోలీసు ఉన్నతాధికారుల ప్రాధమిక విచారణలో వెల్లడి అయింది.
దాంతో ఏపి డిజిపి గౌతమ్ సావాంగ్ ఆదేశాలతో సస్పెండ్ చేశారు. ఎస్ ఐ షేక్ ఫిరోజ్ షా ని సస్పెండ్ చేసి అతనిపై క్రైమ్ నెంబర్ 357/2020 సీతనగరం పి.యస్ సెక్షన్ 324,323,506 r/w 34 ఐపీసీ సెక్షన్ 3(1)(5), సెక్షన్ 3(2)(v) ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు డి. ఐ.జి తెలిపారు.
ఇసుక లారీలను ఆపినందుకు దాడిచేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇసుక లారీలను ఆపిన సమయంలో స్థానిక వైకాపా నాయకుడు అక్కడకు వచ్చాడు. అతడి అనుచరుడి ఫిర్యాదుతో వరప్రసాద్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీతానగరం పీఎస్కు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన వరప్రసాద్కు పోలీసులు శిరోముండనం చేయించారు. పోలీసులు తీవ్రగాయలయ్యేలా కొట్టారు.
అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పోలీసుల తీరుపై ఎస్సీ, ఎస్టీ సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. జరిగిన ఘటనపై కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. వెదుళ్లపల్లిలో బాధితుడు వరప్రసాద్ ఇంటికి వెళ్లి విచారించారు. సీతానగరం ఎస్.ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై డీఎస్పీ కేసు నమోదు చేశారు.