తెలిసి తెలియని మూర్ఖత్వంతో ఒక కుటుంబం చేసిన పనికి బీహార్ లో 100 మందికి పైగా ఇప్పుడు కరోనా బారిన పడ్డారు. న్యూఢిల్లీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఒక యువకుడికి పాట్నాలోని అతని తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకున్నారు. పెళ్లికూతుర్ని సిద్ధం చేసి అతడికి కబురు పెట్టడంతో అతను ఢిల్లీ నుంచి వచ్చాడు.
అయితే అప్పటికే అతనికి కరోనా సోకింది. ఈ విషయం వెల్లడి కావడంతో అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స ప్రారంభించారు. మూడు రోజులు కాగానే అతడిని అతని కుటుంబ సభ్యులు బలవంతంగా ఇంటికి తీసుకువెళ్లారు. జూన్ 15న అతడికి వైభవంగా పెళ్లి జరిపించేశారు. ఈ పెళ్లికి దాదాపు 400 మందికి పైగా అతిథులు హాజరయ్యారు.
పెళ్లి కొడుకును, పెళ్లికూతుర్ని నిండు నూరేళ్లూ ఆనందంగా ఉండమని దీవించారు కానీ రెండు రోజులకే పెళ్లి కొడుకు కరోనాతో చనిపోయాడు. మళ్లీ 300 మంది వచ్చారు. అతడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పాల్గొన్న వారిలో ఇప్పటికి 111 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు.
వారిలో చాలా మందికి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. పెళ్లి, అంత్యక్రియల్లో పాల్గొన్న వారి పూర్తి జాబితా కోసం పాట్నా పోలీసులు వెతుకుతున్నారు. విచిత్రం ఏమిటంటే పెళ్లి కొడుకు కుటుంబంలో కానీ పెళ్లి కూతురికి కానీ కరోనా సోకలేదు.