కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో ఒంగోలు లో ఉన్న సుమారు 5000 వ్యాపార సంస్థలు తీవ్ర ఆర్ధిక నష్టాలతో ఇబ్బందులు పడుతుతున్నాయని ఏపి ఫెడరేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒంగోలు అధ్యక్షుడు తడవర్తి వాసు అన్నారు.
కర్నూలు, నెల్లూరు, గుంటూరు లాంటి అనేక పట్టణములలో కరోనా కేసులు ఉన్నా అక్కడ అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తూ వ్యాపార సంస్థలు తెరుచుకునే వెసులుబాటు కల్పించారని అయితే ఒంగోలులో మాత్రం ఆ వీలు లేకుండా చేశారని ఆయన అన్నారు.
షాపులు తెరవకపోవడం వల్ల వ్యాపారస్తులే ఆయా వ్యాపార సంస్థల లో పనిచేసే సుమారు 25000 వర్కర్స్ కుటుంబాలు కూడా ఎంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. అంతే కాకుండా అద్దె షాపుల్లో వ్యాపారం నిర్వహించే వారు అద్దె కట్టలేక తీవ్ర మానసిక వత్తిడికి లోనవుతున్నారని ఆయన అన్నారు.
కొన్ని వ్యాపారసంస్థలు క్లోజ్ చేసినందువల్ల నిల్వ ఉన్న సరుకులు పాడవుతున్నాయని, దాని వలన ఇంకా నష్టాల ఊబిలోకి వ్యాపారస్తులు దిగిపోతున్నారని తడవర్తి వాసు అన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఒంగోలులో కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ వ్యాపార సంస్థలు తమ తమ వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
నిత్యావసర వస్తువులకు ఉదయం 6 నుంచి 9 వరకూ మిగిలిన సంస్థలకు 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు వ్యాపారాలు చేసుకొనే వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారు. ఈ లాక్ డౌన్ ఇలానే కొనసాగితే కరోనా మరణాలకంటే ఆర్ధిక సమస్యల వలన జరిగే మరణాలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.