ఆన్ లైన్ క్లాసుల పేరుతో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు అవాంఛనీయ విధానాలకు పాల్పడుతున్నాయని బాలల హక్కుల సంఘం (ఏపిబిహెచ్ఎస్) గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
మరీ ముఖ్యంగా శ్రీ చైతన్య, నారాయణ, రవీంద్రభారతి, గౌతమ్ మోడల్ స్కూల్స్ ముఖ్యంగా ఆన్ లైన్ క్లాసుల పేరుతో తల్లిదండ్రుల నుంచి ఫీజులు గుంజుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చాలా కార్పొరేట్ స్కూళ్లు ఇప్పటికే సిలబస్ మొత్తం పూర్తి చేశాయని అయినా ఆ విషయాన్ని చెప్పకుండా ఆన్ లైన్ క్లాసుల పేరుతో మరింత ఫీజులు గుంజుతున్నారని ఆయన తెలిపారు.
ఈ విద్యా సంవత్సరం సిలబస్ కాకుండా వచ్చే విద్యా సంవత్సరం పోర్షన్ కూడా ఇప్పుడే చెబుతామని కూడా అంటున్నారని, అందువల్ల ఆన్ లైన్ క్లాస్ లకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ఆన్ లైన్ క్లాసుల కోసం జూమ్ యాప్ ను వినియోగిస్తున్నారని అచ్యుతరావు అన్నారు.
జూమ్ యాప్ ను బాలికలు వినియోగించడం అంత మంచిది కాదని, వారి ఫొటోలు వారి వివరాలు జూమ్ యాప్ చేతికి వెళ్లిపోతున్నాయని ఇది అవాంఛనీయ పరిస్థితులకు దారి తీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్లు, లాప్ టాప్ లను ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల బాలబాలికలు అనారోగ్యానికి గురవుతారని, వారి కళ్లు దెబ్బతింటాయని అచ్యుతరావు అన్నారు. ఈ కారణాల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కార్పొరేట్ స్కూళ్ల చర్యలను అడ్డుకోవాలని ఆయన కోరారు.