ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో అమ్మవారికి, స్వామివార్లకు నిత్యకైంకర్యాలు, ఏకాంత సేవలుగా యధాప్రకారం ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు తెలిపారు.
దేశం లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేవస్థానంలో జరిగే నిత్య ఆర్జిత సేవలలో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేనందున అన్ని సేవలు ఆలయ అర్చకులుచే ఏకాంత సేవలుగా నిర్వహిస్తున్నామని వివరించారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో రుద్ర హోమము, నవగ్రహ శాంతి హోమం, చండీ హోమము, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము సేవలు పరోక్షంగా భక్తుల గోత్ర నామాల తో జరిపించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు.
పరోక్షంగా చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శ్రీచక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము సేవలు జరిపించదలచిన భక్తులు ఆన్ లైన్ లో www.kanakadurgamma.org వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.
లాక్ డౌన్ సమయంలో ఆహారం దొరక్క ఇబ్బంది పడేవారికి ఆహారం అందించాలన్న ఉద్దేశ్యంతో దేవస్థాన నిత్యాన్నదాన ట్రస్ట్ విభాగం ద్వారా ప్రతి రోజు కదంబం, దద్దోజనం(పెరుగన్నం) ప్యాకెట్లు సురక్షిత వాతావరణంలో తయారు చేసిన అనంతరం ప్యాకింగ్ చేసి VMC వారి ద్వారా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
దేవస్థానం జరిపే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇవ్వదలచిన భక్తులు దేవస్థానం వారి వెబ్సైటు www.kanakadurgamma.org ద్వారా , లేదా eosdmsd@sbi అను BHIM UPI ద్వారా QR code ను స్కాన్ చేసి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా విరాళములు పంపవచ్చని కార్యనిర్వహణ అధికారి తెలిపారు.