ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 26న జరుగనున్న రాములవారి కల్యాణానికి కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని, ఇందుకోసం 5 వేల మందికి పాసులు జారీ చేస్తామని టిటిడి ఈఓ డాక్టర్ కెఏస్.జవహర్ రెడ్డి తెలిపారు.
ఒంటిమిట్టలోని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ తో కలిసి ఈఓ పరిశీలించారు. అనంతరం రాములవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఈఓ మీడియాతో మాట్లాడుతూ శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 21 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు. ఏప్రిల్ 26న రాత్రి 8 గంటలకు రాములవారి కల్యాణం నిర్వహించాలని టిటిడి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి తొలిసారిగా కల్యాణానికి విచ్చేయనున్నట్టు తెలిపారు. కల్యాణవేదిక వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేపడతామన్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని, పాసులు పొందలేనివారు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కల్యాణాన్ని వీక్షించవచ్చన్నారు. భక్తులందరూ టిటిడికి సహకరించాలని ఈ సందర్భంగా ఈఓ విజ్ఞప్తి చేశారు.
ఈఓ వెంట స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, జెఈఓ సదా భార్గవి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి తదితరులు ఉన్నారు.