ఒంటిమిట్ట శ్రీకోదండరాముని శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 21 నుండి 29వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి అధికారులు సమాయత్తం కావాలని జెఈవో సదా భార్గవి చెప్పారు.
రాజంపేట శాసన సభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు మేడా మల్లిఖార్జున రెడ్డి తో కలసి శనివారం ఆమె ఆలయం, కళ్యాణ వేదిక పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ, రాష్ట్ర పండుగగా జరిపే శ్రీరామ నవమి వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని జెఈవో అధికారులను ఆదేశించారు.
టీటీడీ అధికారులు జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
ఏప్రిల్ 26న శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి దాదాపు రెండు లక్షల మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉందన్నారు.
శ్రీసీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి విచ్చేసే అవకాశం ఉండడంతో పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుని భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
వాహనాల పార్కింగ్కు స్థలాలను గుర్తించి తగు చర్యలు చేపట్టాలని చెప్పారు.
కల్యాణం రోజున అన్నప్రసాదం పంపిణీ చేయాలని, తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని, వైద్య బృందాలు, అంబులెన్స్ సిద్ధంగా వుంచుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఆలయం, పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యంకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
కళ్యాణ వేదిక వద్ద మైక్ సిస్టం ఎలాంటి ఇబ్బంది రాకూడదన్నారు. బ్రహ్మోత్సవాల 9 రోజులు ఆలయం,కళ్యాణ వేదిక వద్ద పుష్పఅలంకరణ అద్భుతంగా ఉండాలన్నారు. ఇందుకు అవసరమయ్యే 15 టన్నుల పువ్వులు, పండ్లు విరాళాల ద్వారా సేకరించే ఏర్పాటు చేయాలని సూచించారు.
ఎమ్మెల్యే మల్లిఖార్జున రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ఎంతమందికైనా తాము అన్నదానం చేస్తామని చెప్పారు. పుష్పఅలంకరణకు అవసరమయ్యే పువ్వులు,పండ్లు విరాళంగా అందక పోతే తామే సమకూరుస్తామన్నారు.
ఎస్ఈ లు జగదీశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో రమేష్ బాబు, ఎస్టేట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మద, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్, డిఎఫ్ ఓ చంద్రశేఖర్, ఏవి ఎస్వో గిరిధర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.