చారిత్రాత్మక పట్టణమైన కొల్లాపూర్ కు ఏమైంది? వందల సంవత్సరాలుగా సురక్షిత ప్రాంతంగా ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణం ఇప్పుడు వర్షం వస్తే వణికిపోతున్నది.
కట్టలు తెంచుకుని ప్రవహించే సైడుకాల్వలతో అల్లాడిపోతున్నది. కొల్లాపూర్ లో వరద భీభత్సాన్ని చూసి తట్టుకోలేని ఒకరు కొల్లాపూర్ ప్రజలకు, నాయకులకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ యధాతధంగా:
వరద బారిన పడిన కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ అన్ని వర్గాల నాయకులకు, కార్యకర్తలకు, కొల్లాపూర్ పట్టణ ప్రజలకు నేను చేసే మనవి ఏమిటంటే
16.9 సెంటీమీటర్ల వర్షాన్ని కూడా తట్టుకునే శక్తి కొల్లాపూర్ పట్టణానికి లేదా? పర్యాటక ప్రాంతం అయిన సోమశిల కు వెళ్లే దారిని తవ్వినప్పుడే అర్ధం అవుతుంది ఈ విపత్తును తట్టుకునే శక్తి కొల్లాపూర్ కు పోయింది అని..
కారణం సమీక్షించుకోవాలి. అలనాడు రాజుల పాలనలో కొల్లాపూర్ ప్రాంతాన్ని సురక్షితమని భావించి పాలనా కేంద్రం గా ఏర్పాటు చేసుకున్నారు. నాటి నుండి నేటి వరకు ఆ కోట నిలబడే ఉంది…. మన చరిత్రను గుర్తు చేస్తూ.
పట్టణం అలానే ఉంది చరిత్రకు సాక్ష్యంగా. ఆ నాటి కాల్వల వ్యవస్థ చూస్తే అర్ధం అవుతుంది మన కొల్లాపూర్ కి ఎలాంటి విపత్తు నైనా తట్టుకునే శక్తి ఉందని. మరి ఇప్పుడు ఆ శక్తి ఏమైంది?
జన సాంద్రత పెరిగి మునిసిపాలిటిగా మారి పెరిగి పెద్దదై శక్తి పోయిందా? అలానే కనిపిస్తున్నది. పట్టణ విస్తరణ పేరుతో ఆక్రమణలు, చెరువులు పూడ్చివేయడం, కాలవలు తవ్వేయడం, ఆక్రమించుకోవడం…..
కారణాలు ఏమైనా. కారకులు దేవుడు, పాలకులు, ప్రజలు. అయినా మనం మేలుకొని భవిష్యత్తు తరాలకు లక్ష కుటుంబాలు అయినా కూడా చల్లగా బ్రతికేటట్లు మన కొల్లాపూర్ ని స్వర్గసీమగా శక్తివంతంగా తయారు చేయాలి.
చిన్న చిన్న కాలువలు పెద్ద కాలువలో చేరే దారిని, పట్టణ విసర్జన దారులను మెరుగు పరచాలి, మురుగు నీరు, వర్షపు నీటి వ్యవస్థను భవిష్యత్తు లో వచ్చే విపత్తులను పరిగణలోకి తీసుకొని మెరుగు పరుచుకోవాలి.
పాత కట్టడాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి.. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి కి వచ్చాము. మేలుకొందాము….ఇప్పటికైనా..
ఖదీర్ S/o యూసఫ్ మేస్త్రి