కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టి పిసిసి జాయింట్ సెక్రెటరీ అజీజ్ పాషా డిమాండ్ చేశారు. ఆయన ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కి బహిరంగ లేఖ రాశారు.
ప్రయివేటు టీచర్ల ఆకలి కేకలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలు తెరిచే వరకు ప్రయివేటు ఉపాద్యాయినీ, ఉపాధ్యాయులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని కోరారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రైవేట్ ఉపాద్యాయినీ, ఉపాధ్యాయులు ఇన్నాళ్లు గౌరవప్రదంగా జీవించారని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఉపాధిలేక మానసిక వేదనకు గురి అవుతూ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్ కళాశాలలో, డిగ్రీ కాలేజీలలో, పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లు, అధ్యాపకులు, సుమారు 6 నెలలుగా వేతనాలు రాక బయటికి చెప్పుకోలేక లోలోన మదనపడుతున్నారని అన్నారు.
స్కూల్స్, హాస్టల్స్, కళాశాలలు, పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది వార్డెన్స్,వాచ్ మెన్ లు, వంట మనుషులు, స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు, ఇలా వీరందరికీ యాజమాన్యాలు జీతాలు ఇవ్వాలని ఏపీడమిక్స్ డిసీజెస్ 1897 G.0.నెం 45 ఉన్నప్పటికి క్షేత్ర స్థాయిలో అది అమలు జరగటం లేదని, దీనిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని విజ్ఞప్తి చేశారు.