రైతు రాజ్యం తెచ్చేందుకే సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, రైతు సమస్యలు తీర్చుకునేందుకు క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని రైతువేదిక ద్వారా రైతులకు న్యాయం చేకూరుతుందన్న ఉన్నతాశయంతో కేసీఆర్ రైతువేదికలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, రాష్ర్ట ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందంటే అది ఏలాంటి నిర్ణయమైనా సరే భేషజాలకు పోకుండా ఓ మెట్టు దిగి అయినా వాటిని పరిష్కరిస్తున్నారని ఉదాహరణకు ఎల్ఆర్ఎస్ అని, మరోపక్క కేంద్ర ప్రభుత్వం గత 45 రోజులుగా రైతులు చలిలో రోడ్డెక్కితే చర్చల పేరుతో కాలాయాపన చేస్తోందని, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరును ప్రజలు గమనించాలని నిష్పక్షపాతంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వమని మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఇందులో భాగంగా వికారాబాద్ నియోజకవర్గం ధారుర్ లో రెండు కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కోట్ పల్లి మండలం రాంపూర్, బార్వాద్ గ్రామలలో 44 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి, వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ కార్యక్రమంలో వెళ్ళినా ముందుగా ప్రజల బాగోగులు తెలుసుకోవాలని, రైతులకు రైతుబంధు అందిన విషయాలపై వివరాలు సేకరించాలని ఇంకా ఎవరికైనా రైతుబంధు అందకపోతే వెంటనే వారికి అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ తమకు పదేపదే చెబుతారని కొనియాడారు. రైతులు, ప్రజల పట్ల ఆయన తీసుకుంటున్నచొరవకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ ఎలాంటి భేషజాలకు పోకుండా ఒక మెట్టు దిగారని పాత పద్ధతిలోనే రిజిస్ర్టేషన్లను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారని, అలాగే ఎల్ఆర్ఎస్ను రద్దు చేశారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్ట ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాలనే తపన పడుతోందన్నారు. మరోపక్క గొప్పలకు పోతున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక మెట్టు దిగేందుకు ససేమిరా అంటున్న విషయాన్ని ప్రజలంతా గమనించాలన్నారు. రైతులు గత 45 రోజులుగా ఎండనక, వాననక, చలి అనక రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం చర్చల పేరుతో వారి సమస్యలను పరిష్కరించేందుకు ఏ మాత్రం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు.
టీచర్ల పదోన్నతులపై మంత్రి సమావేశం
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల పదోన్నతులపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
బోధన, బోధనేతర సిబ్బందికి క్యాటగిరీల వారీగా ప్రమోషన్లను పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని విద్యా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. బదిలీలు, మధ్యాహ్న భోజనం, టెట్ పరీక్ష, విద్యా సంస్థల ప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. ప్రమోషన్ల కోసం ప్రస్తుతం ఉన్నవ్యవస్థకు అనుగుణంగా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, జి.ఎ.డి ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఒమర్ జలీల్, సాంకేతిక, కళాశాల విద్యా శాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, పాఠశాల విద్యా శాఖ కమీషనర్ దేవసేన, అధికారులు పాల్గొన్నారు.