ఆపరేషన్ ముస్కాన్..కరోనా 19 లో భాగంగా జిల్లాలో 91 మంది పిల్లలను రెస్క్యూ చేసామని ఏపీలోని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ అన్నారు.. జిల్లా పోలీస్ బ్యారెక్స్ లోని జరిగిన కార్యక్రమంలో ఆనాధ పిల్లలు, చదువుకోలేని పిల్లలను గుర్తించిన పోలీస్ శాఖ..వారిని చైల్డ్ సంరక్షణా కేంద్రానికి తరలించే పనిలో పడింది.
ఈ సందర్బంగా విజయనగరం డివిజన్ పరిధిలో ఎస్.కోట,పూసపాటిరేగ,భోగాపురం, విజయనగరం రూరల్, వన్ టౌన్,టూటౌన్ పోలీస్ స్టేషన్ ల నుంచీ దాదాపు 91 మంది బాలలను సంరక్షించే బాధ్యతను పోలీస్ శాఖ ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా చేపట్టింది. ఈమేరకు పోలీస్ బ్యారెక్స్ లో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ రాజకుమారీ మాట్లాడుతూ..విజయనగరం డివిజన్ లోని ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబంలో ఏడుగురు పిల్లలను కన్నవాళ్లు చదివించలేక పనిలో పెట్టి వారు తెచ్చిన డబ్బుతోనే కాలం గడపటాన్ని తమ శాఖ గుర్తించిందన్నారు.
కేవలం మగబిడ్డ కోసం…ఎదురు చూసి చూసి…ఏడుగురు ఆడపిల్లలకు ఆ కన్నవాళ్లు జన్మనిచ్చారని ఎస్పీ తెలిపారు.ఒక విధంగా వంశాకురం కోసం కన్నవాళ్లు చూసినా…ఆడపిల్లలే నేడు అంతరిక్షంలోకి దూసుకెళుతున్నారని ఎస్పీ అన్నారు. కాగా ఆడ పిల్లల తండ్రి ఓ అవిటి వాడు కావడంతో కడుపున పుట్టిన పిల్లలను చదవించుకోలేక..కుటుంబం గడవటం కోసం పిల్లలను పనిలోకి పెట్టించారని కాని ఇదీ చట్ట రీత్యా నేరమని ఎస్పీ గుర్తు చేసారు.
డీజీపీ ఆదేశాలతో తమ శాఖ చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో ఆ తండ్రి ట్రై సైకిల్ ఇవ్వడం తో పాటు…పిల్లలను బాలల సంరక్షణ కేంద్రాంలో చేర్పించేందకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా తమ శాఖ చర్యలు చేపడుతోందన్నారు.అంతకుమందు విజయనగరం డీఎస్పీ అనిల్ మాట్లాడుతూ…ఈ ఆపరేషన్ ముస్కాన్ ద్వారా అనాధ పిల్లలతో పాటు వీది బాలలను సంరక్షించే బాధ్యతను ఎస్పీ ఆదేశాల మేరకు చేపడుతున్నామన్నారు.
ఈ మేరకు విజయనగరం వన్ టౌన్ నుంచీ 14, టూటౌన్ నుంచీ 5 గురు, రూరల్ నుంచీ ఏడుగురు చిన్నారులను గుర్తించామని అలాగే తమ డివిజన్ పరిధిలో పూసపాటిరేగ, డెంకాడ, కొత్త వలస,ఎస్.కోట స్టేషన్ ల నుంచీ చిన్నారుల దత్తత స్వీకరిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శేషాద్రి,ఎస్బీ సీఐలు శ్రీనివాసరావు,రాంబాబు, ఏఆర్ అడ్మిన్ చిరంజీవి, వన్ టౌన్ సీఐ మురళీ, టూటౌన్ సీఐ శ్రీనివాసరావు, రూరల్ సీఐ మంగవేణి, పూసపాటి రేగ ఎస్ఐ జయంతి, భోగాపురం ఎస్ఐ లతో పాటు చిన్నారులు పాల్గొన్నారు.