భారత నావికా దళం ప్రతిష్టాత్మక సముద్ర సేతు ఆపరేషన్ ప్రారంభించింది. విదేశాలో చిక్కుకుపోయి కరోనా విపత్తు కారణంగా మన దేశానికి రాలేకపోతున్న వారిని తీసుకువచ్చే ఈ ఆపరేషన్ కోసం జలాశ్వ, మాగర్ లను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు ఓడలు మాల్దీవ్స్ లోని మాలె ఓడరేవుకు పయనం అయ్యాయి.
మే 8వ తేదీ నుంచి ఆపరేషన్ సముద్ర సేతు తొలి దశ ప్రారంభం అవుతుంది. దేశం వెలుపల ఉన్న మన దేశస్థులను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించినందున నావికాదళం ఆ బాధ్యతను స్వీకరించింది. సముద్ర మార్గం ద్వారా విదేశాలలో చిక్కుకుపోయిన వారిని తీసుకువచ్చే బృహత్ కార్యక్రమం ద్వారా తొలి దశలో దాదాపు వెయ్యి మందిని స్వదేశానికి తిరిగి తీసుకువస్తారు.
ఓడలో సామాజిక దూరాన్ని పాటిస్తూ వారందరిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ 19 ప్రోటోకాల్స్ ప్రకారం సముద్ర యానంలో అందరికి ఆహార వసతి కల్పిస్తారు. ఆరోగ్య పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటారు. తీసుకువచ్చిన వారిని కేరళలోని కొచ్చి ఓడరేవులో దించుతారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమాచారం అందించినందున వారు తగిన ఏర్పాట్లు చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, హోం మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఈ ఆపరేషన్ సముద్ర సేతు ప్రారంభించారు.