ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకతతో ఉన్న టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించేందుకు భారీ ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బోధన కోసం ఉద్యోగాల్లో చేరిన వీరికి దశాబ్దాలుగా బోధనతో పాటు జనగణన, టీకాల పంపిణీ, ఎన్నికల విధులు అప్పగిస్తున్నారు. ఇప్పుడు వీరికి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఉపాధ్యాయులు బోధనపై పూర్తిస్దాయిలో దృష్టిపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నది. ఏడాది పొడవునా బోధనతో పాటు ఎన్నికలు, జనగణన, టీకాల పేరుతో బోధనేతర విధుల్లో బిజీగా ఉంటున్న వీరికి వాటి నుంచి ఊరట కల్పించింది. ఇకపై టీచర్లు స్కూల్లో పాఠాలు మాత్రమే చెప్పేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఉపాధ్యాయలు విధుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిబంధనల్ని సవరించింది. టీచర్లను బోధనకు మాత్రమే పరిమితం చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించేందుకు కేబినెట్ వర్చువల్ గా సమావేశమైంది. ఈ సమావేశంలో కేబినెట్ మంత్రులు ఈ మేరకు సవరణల్ని ఆమోదించారు. గవర్నర్ ఆమోదించడంతో ఈ అమల్లోకి వచ్చాయి. టీచర్లు ప్రధానంగా నిర్వహించే విధుల్లో ఎన్నికల నిర్వహణ కూడా ఉంది.
టీచర్లు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసి ఉన్నారు. ఛలో విజయవాడ పేరుతో ఐదు లక్షల మంది టీచర్లు ఒక్క చోటకు చేరి ప్రభుత్వం పరువు తీశారు. దాంతో వీరికి ఎన్నికల విధులు అప్పగిస్తే ఫలితం వేరుగా ఉంటుందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.