తిరుమల తిరుపతి దేవస్థానం మాసపత్రిక సప్తగిరి తో బాటు” సజీవ సువార్త ” అనే మాసపత్రిక రావడంతో గుంటూరుకు చెందిన ఒక పాఠకుడు హతాశుడయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికను తాము ఎంతో పవిత్రంగా భావిస్తామని అయితే ఆ పవిత్రతను మంట గొలిపే విధంగా ఉందని ఆయన వాపోయారు.
దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం వివరణ ఇచ్చింది. వివరణ ఈ విధంగా ఉంది: సప్తగిరి మాస పత్రిక బట్వాడ సందర్బంగా గుంటూరుకు చెందిన ఒక పాఠకుడికి సప్తగిరితో పాటు అన్యమతానికి చెందిన మరో పుస్తకం బట్వాడా అయినట్లు మా దృష్టికి వచ్చింది.
టిటిడి ప్రతిష్టను దెబ్బ తీయడానికి కొంత మంది చేసిన చర్యగా భావించి దీనిపై నిజాలను నిగ్గుతేల్చేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశాం. సప్తగిరి మాస పత్రికలను పోస్టల్ శాఖ వారే ప్యాక్ చేసి, బరువు చూసి పాఠకుడి చిరునామాలు అతికించి బట్వాడ చేస్తారు.
ఇందుకోసం పోస్టల్ శాఖకు పోస్టేజి చార్జీలతో పాటు ఒక్కో ప్రతికి అదనంగా రూ. 1.05 టిటిడి అదనంగా చెల్లిస్తోంది. పోస్టల్ శాఖ సప్తగిరి మాస పత్రికను బుక్ పోస్టులో పంపుతుంది కనుక ఎలాంటి సీలు ఉండదు. సప్తగిరి మాస పత్రిక ప్యాకింగ్, డెలివరి భాధ్యత మొత్తం పోస్టల్ శాఖవారే చూస్తారు.
ఈ విషయంగా పలు జిల్లాలకు చెందిన సప్తగిరి పాఠకులకు ఫోన్ చేసి విచారించగా అలాంటి అన్యమత పుస్తకం తమకు అందలేదని తెలియజేశారు. దీనిని దురుద్యేశ చర్యగా భావిస్తూ టిటిడి తీవ్రంగా పరిగణిస్తోంది.