ఓటిటి, షోషల్ మీడియాపై మూడు అంచెల నియంత్రణ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ఐటీ, కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఓటిటి లో ఐదు అంశాలను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
అసభ్య, అశ్లీల, హింసాత్మక కంటెంట్ పై నిషేధం విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అదే విధంగా వయస్సు ఆధారంగా 5 విభాగాలుగా ఓటీటీ విభజన ఉంటుంది. సామాజిక ఉద్రిక్తతలు పెంచే కంటెంట్ పై నిషేధం విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే అంశాల పై కూడా నిషేధం ఉంటుంది. మహిళలు, చిన్నారులు, దళితులను అవమానించే కంటెంట్స్ పై కూడా నిషేధాజ్ఞలు ఉంటాయి. జాతీయ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసే కంటెంట్ పై ఇప్పటికే ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తారు.
అదే విధంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం పై నియంత్రణ ఉంటుంది. అసత్య ప్రచారం ప్రారంభం చేసే తొలి వ్యక్తి వివరాలు ఖచ్చితంగా వెల్లడించాలి. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే అసత్య ప్రచారం కంటెంట్ తొలగించాలి.
ఫిర్యాదులను పరిష్కరించే అధికారులు దేశం లోనే ఉండాలి. ఫిర్యాదులను పరిష్కరించే అధికారులు 24 గంటలూ దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉండాలి.