సనాతన ధర్మాలను భావితరాలకు తెలియజేస్తూ, ప్రజలలో ఆధ్యాత్మిక చింతన, సేవాతత్పరత నెలకొనే విధంగా చేయడం ఎంతైనా అభినందనీయమని ఏపీలోని విజయనగరం ఎమ్మెల్యే,డిప్యూటీ స్పీకర్ కూతురు.. విజయనగర మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు.
ఈ మేరకు నగరంలోని 44వ డివిజన్ అయ్యన్నపేట విజయనగర్ కాలనీలో శ్రీ వీరాంజనేయ ఆలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 6 వ వార్షికోత్సవ వేడుకలలో ఆమె పాల్గొన్నారు. ఆలయానికి చేరుకోగానే ఉత్సవ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు.
ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీదేవి, భూదేవి, నందీశ్వరుడు విగ్రహ ప్రతిష్ట, సాయిబాబా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీలలో ఇలాంటి దేవాలయాలు ఏర్పాటు వల్ల ప్రజలలో ఆధ్యాత్మికత భావన, స్నేహ భావం , సేవాతత్పరత నెలకొంటుందని అన్నారు. సమాజ హిత కార్యక్రమాలు చేసే ప్రతి పనిలోనూ తమ కుటుంబ సహాయ సహకారాలు ఉంటాయన్నారు.
శ్రీ వీరాంజనేయ ఆలయ కమిటీ నిర్వాహకులు జామి సూరిబాబు మాట్లాడుతూ ఆలయం స్థాపించి ఆరు వసంతాలు పూర్తయిందని, ఆలయం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆలయ అభివృద్ధి విషయంలో శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి కృషి మరువలేనిదని అన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణికి శాలువా కప్పి ఉచిత రీతిన సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రసాద్, బంగారయ్య, కార్పొరేటర్ తాళ్లపూడి సంతోషి ని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేంక సత్యం, సైలాడ సత్యనారాయణ, లేంక మహేష్, తాళ్లపూడి పండు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.