అనంతపురం రూరల్ మండల పరిధిలో పెండింగ్ లో ఉన్న పేదోళ్ళ ఇళ్ళ నివేశస్థలాలకు పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నవయుగ కాలని ప్రజలతో కలసి ఆపార్టీ నాయకులు కార్యకర్తలు నగరంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నగర సహాయ కార్యదర్శి అల్లిపీర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నగర కార్యదర్శి శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ పరిధిలోని సోమలదొడ్డి గ్రామ పొలం సర్వే నెంబరు 67/4 లో 3 ఎకారాల స్థలంలో 84 నిరుపేద కుటుంబాలు 2018 లో ఇళ్ళు నిర్మించుకుని నవయుగ కాలని ఏర్పాటు చేసుకున్నారని గుర్తు చేశారు.అయితే ఇప్పటి వరకు సంబంధిత అధికారులు కాలని వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని మండి పడ్డారు.
కాలని అన్ని విధాలా అభివృద్ధి చెందాలని పలుమార్లు కాలని వాసులు సంబంధిత అధికారులకు తెలియజేసినా ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. నవయుగ కాలనీలో చిన్న చిన్న కూలీలు, తోపుడు బండ్ల వ్యాపారులు, సంఘటిత కార్మికులు జీవిస్తున్నారన్నారు.రాళ్ళు, ముళ్ళ పొదలతో గుట్టలు గుట్టలుగా ఉన్న ఉన్న ఆ ప్రాంతాన్ని నిరుపేదలు చందాలు వేసుకుని, అప్పులు చేసి ఆ ప్రాంతాన్ని చదును చేసుకున్నారని తెలిపారు. ఆ క్రమంలోనే దాతల సహకారంతో విద్యుత్ సౌకర్యం తో పాటు త్రాగునీటి సరఫరా ఏర్పాటు చేసుకున్నారన్నారు. సుమారు నాలుగు సంవత్సరాలుగా కాలని ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నవయుగ కాలని లో ప్రతి ఇంటికి గుత్తలు వేయాలని రోడ్లు, మురుగు కాల్వలు వేయించాలని పూర్తి స్థాయిలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక నగరానికి చెందిన 30 వేల మంది పేద ప్రజలకు అర్బన్ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పట్టాలు పంపిణీ చేశారని అయితే గత మూడేళ్లుగా కనీసం 30 ఇళ్ళు కూడా కట్టలేక పోయారని ఘాటుగా విమర్శించారు. గత ప్రభుత్వ హాయంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళు లబ్ది దారులకు కేటాయించకుండా వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందని అసహనం వ్యక్తం చేశారు.దీంతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన టిడ్కో ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయని అందులో తేళ్ళు, పాములు లాంటి విషసర్పాలు కాపురమున్నాయని ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. నవయుగ కాలని ఇళ్ళతో పాటు,40 వ డివిజన్ పరిధిలోని కామ్రేడ్ పార్వతమ్మ కాలని లో సైతం ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పోరాటం మరింత ఉదృతం చేస్తామని సీపీఐ శ్రీరాములు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అనంతరం డిప్యూటీ తహశీల్దార్ బాషా కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు లింగమయ్య, నగర సహాయ కార్యదర్శి రమణ,నాయకులు చాంద్ బాష,ఎల్లుట్ల నారాయణ స్వామి,మున్నా, సుందర్ రాజు, చిత్రచేడు రామాంజినేయులు, రమణ, రమేష్, జయలక్ష్మి, రాజు కాలని వాసులు,తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్.నెట్ అనంతపురం