మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు శత జయంతి సందర్భంగా తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణా సాహిత్య అకాడమి, హైదరాబాద్ పాత నగర కవుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో వెలువడిన “కాలాతీతుడు” కవిత్వ సంకలనంలో బహుమతి పొందిన రచనలకు ఈ నెల 8న బహుమతి ప్రదానం జరుగుతుంది.
రాసిన కవితల్లో బహుమతి పొందినవారికి అభినందన సత్కారం ఉంటుందని హైదరాబాద్ పాతనగరకవుల వేదిక, లాల్ దర్వాజ కన్వీనర్ కె.హరనాథ్ తెలిపారు. పి వి నరసింహారావు జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తూ ప్రముఖ కవులు కవయిత్రుల నుంచి వర్ధమాన కవుల వరకూ పంపిన ఈ కవిత్వాలను సత్యంన్యూస్.నెట్ లో ధారావాహికంగా ప్రచురించిన విషయం తెలిసిందే.
ఏప్రియల్ 8వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరం మొదటి అంతస్తులో సభా కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ, మాజీ ప్రధాని పి వి నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి, విశిష్ట అతిథులుగా వేమిరెడ్డి నరసింహారెడ్డి (చైర్మన్ రాజధాని బ్యాంక్) జూలూరి గౌరీశంకర్ (ఛైర్మన్ తెలంగాణా సాహిత్య అకాడమి) యస్వీ.సత్యనారాయణ (పూర్వ సంచాలకులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం) హాజరవుతారు.
అదే విధంగా ఆత్మీయ అతిథులుగా మామిడి హరికృష్ణ (సంచాలకులు, భాషా సాంస్కృతికశాఖ), పులిపాక సత్యమూర్తి (సత్యంన్యూస్.నెట్ చీఫ్ ఎడిటర్), డా. కె.అనితారెడ్డి (సిడబ్ల్యుసి మాజీ చైర్ పర్సన్) లు పాల్గొంటారు. పి.వి.నరసింహారావు ‘కాలాతీతుడు’ పుస్తకం లో ప్రచురించిన కవితల్లో బహుమతి పొందిన కవులు, కవయిత్రులకు అభినందన సత్కారం ఉంటుంది. అనంతరం కవి సమ్మేళనం జరుగుతుందని హరనాథ్ తెలిపారు.
బహుమతి పొందిన వారి వివరాలు:
మొదటి బహుమతి నూటెంకి రవీంద్ర (లోపలి మనిషి),
ద్వీతీయ బహుమతి గుండేటి వెంకటరమణ (బలగం లేని బలమైన నాయకుడు),
తృతీయ బహుమతులు అరుణ నారదభట్ల (తోరణాలు), పి.వి.యస్ కృష్ణకుమారి (నీవు ఎవరు) మంజుల సూర్య (పి.వీ.ఠీవి)
మరో పదిమందికి ప్రోత్సాహక బహుమతులతో సత్కరించిన తరువాత శ్రీ శుభకృత్ ఉగాది సందర్భంగా 30మంది కవులతో డా. వడ్డేపల్లి కృష్ణ, డా. కాంచనపల్లి, డా. ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్షతన కవి సమ్మేళనం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, ఇతర వివరాలకు 9703542598, 9182178653 నెంబర్లకు సంప్రదించాలని హరనాథ్ కోరారు.