217 కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వానకాలంలో పండించిన వరిధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. జిల్లాలో వానకాలంలో 3 లక్షల 81 వేల 525 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా పిఎసిఎస్ 198, డిఆర్డిఎ 13, ఏఎంసి 4, మెప్మా 2 మొత్తం 217 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అదేవిధంగా 77,02024 గన్ని బ్యాగులు అవసరం కాగా జిల్లాలో 32,92,029 గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయని 217 కేంద్రాలకు సరఫరా చేసినట్లు వెల్లడించారు. ఇంకా అవసరమైన గన్ని బ్యాగులకు రాష్ట్ర అధికారులకు నివేదించినట్లు తెలిపారు. జిల్లాలో రైతుల నుండి వరి కొనుగోలు చేసేందుకు పక్క ప్రణాళికలు రూపొందించామని వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ అధికారులు చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు అనేది ప్రస్తుతం చాలా సున్నితమైన అంశమన్నారు. జిల్లాలో పండించిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆరోపణలు రాకుండా రైతుల నుండి సమయానికి కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే వరిధాన్యం కోతకు వచ్చినందున ఆయా ప్రాంతాల్లో వెంటనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుండి వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు.
ప్రతి కొనుగోలు కేంద్రంలో ముందస్తుగా ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ లను సిద్ధం చేయలన్నారు. తేమ శాతంను కొలిచే మిషన్ లను కూడా ముందుగానే చెక్ చేయించుకోవాలని స్పష్టం చేశారు. తేమ శాతంపై రైతులకు అవగాహన కల్పించాలన్న కలెక్టర్ కొనుగోలు కేంద్రాలలో సరిపడినంతగా టార్పాలిన్లు, గన్ని బ్యాగులు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. అలాగే, కూలీల సమస్య కాకుండా చూడాలని చెప్పారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రవాణా ఏర్పాట్లను పక్కాగా చేయాలని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించి తేమ శాతం లేకుండా ఉండేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారి ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా ఉంచుకోవాలని మార్కింగ్ శాఖకు ఆదేశించారు. కొనుగోలు చేసిన వారి ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు తరలించి సాధ్యమైనంత త్వరగానే రైతులకు డబ్బు చేరేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, డిఆర్డిఎ పిడి నర్సింగరావు, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు డిఎం సివిల్ సప్లై బాలరాజు ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.