రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
నిర్మల్ జిల్లా మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతాంగానికి అవసరమైన సాగు నీటిని అందిస్తున్నారనీ, 24 గంటల పాటు కోతల్లేని, నాణ్యమైన కరెంటుని అందిస్తున్నారని తెలిపారు.
రైతు మార్కెట్ యార్డ్కు వెళ్లి తమ ధాన్యాన్ని విక్రయించు కోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగమే గ్రామాలకు వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు.
ఈ మేరకు గ్రామ గ్రామాన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా మద్దతు ధరకు వరి ధాన్యం సేకరించడం జరుగుతుందన్నారు.
ఏ గ్రేడ్ కు రూ.1,888, బీ గ్రేడ్ కు రూ.1,868 మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు.