దేశ వ్యాప్తంగా అమలు జరుగుతున్న లాక్ డౌన్ వల్ల రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ధాన్యాన్ని గ్రామాల్లో ప్రత్యేక కొనుగోలు సెంటర్ ను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామని ఆయన అన్నారు.
రైతులు ప్రతి ఒక్కరూ సహకరించి ముందుగా టోకెన్ల తీసుకోవాలని, టోకెన్ల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్ లో ధాన్యం అమ్మాలని మంత్రి తెలిపారు. ఈ రోజు వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనా వైరస్ అరికట్టడం కోసం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ముఖ్యఅతిథిగా వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో బాటు ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ, జెడ్పీచైర్మన్ లోకనాథ్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, కలెక్టర్ యాస్మిన్ భాష, ఎస్పీ అపూర్వరావు, హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిత్యావసరాలు అందరికి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వైద్య సిబ్బందికి, పోలీసులకు సౌకర్యంగా ఉండే విధంగా చూడాలని, ప్రజలందరూ లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం కావాలని కోరారు.
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రాంతంలో ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాలేదు వైద్య సిబ్బంది ,ఆశా వర్కర్లు ముందస్తు చర్యలు తీసుకొని ఇంటింటి తిరిగి అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ నివారణకు ప్రజలకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వైద్యాధికారుల అవగాహన కలిగించి ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లలోనే ఉంటూ ప్రభుత్వo ప్రకటించిన (లాక్ డౌన్) స్వయం కర్ఫ్యూ పాటించాలని సూచించారు.