ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల ఏర్పాట్లు ,సన్నాహకాలపై కలెక్టర్ లో ఎమ్మెల్యే కోలగట్ల అధ్యక్షత న అన్ని శాఖల అధికారులతో సమావేశం జరిగింది.సంప్రదాయాలను పాటిస్తూ, శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాన్ని గతం కంటే మిన్నగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, అధికారులను రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు.
వీటితోపాటుగా విజయనగరం వైభవాన్ని చాటిచెప్పే విధంగా, విజయనగరం ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. అక్టోబరు 10,11 తేదీల్లో జరిగే పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు, అక్టోబరు 9,10,11 తేదీల్లో నిర్వహించే విజయనగరం ఉత్సవాలపై, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
వివిధ వర్గాల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ, పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం, విజయనగరం ఉత్సవాల షెడ్యూల్ను, వివిధ వేదికల్లో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలను ప్రకటించారు. వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన విధులు, బాధ్యతలను వివరించారు.
కోవిడ్ కారణంగా రెండేళ్లుగా ఉత్సవాలకు విరామం
కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా విజయనగరం ఉత్సవాలను నిర్వహించలేకపోయామని, పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరానికి సామాన్య భక్తులను అనుమతించలేదని చెప్పారు. ఈ ఏడాది సిరిమానోత్సవానికి సాధారణ భక్తులను అనుమతిస్తామని, విజయనగరం ఉత్సవాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక బస్సులను కూడా నడపనున్నట్లు తెలిపారు.
విజయనగరం ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, కరోనా వల్ల గత రెండేళ్లూ నేరుగా సిరిమాను ఉత్సవాలను చూసే అవకాశాన్ని సామాన్య భక్తులు దూరమయ్యారని అన్నారు. ఈ ఏడాది గతం కంటే వైభవంగా ఉత్సవాలను నిర్వహించి, భక్తులందరికీ అవకాశం కల్పించాలని కోరారు. విజయనగరం ఉత్సవాల్లో స్థానిక ప్రముఖలను భాగస్వాములను చేయాలని, జీవితకాల సభ్యుల సేవలను వినియోగించకోవాలని సూచించారు.
సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా, విఐపి పాసులను రద్దు చేయాలని అన్నారు. భక్తులకు తగిన గౌరవం ఇస్తూ, అన్ని సంప్రదాయాలను పాటిస్తూ, రాజకీయాలకు అతీతంగా సమష్టిగా ఉత్సవాలను నిర్వహించాలని కోరారు.
ఆన్ లైన్ లో కూడా దర్శనం టిక్కెట్లు
జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దర్శన టిక్కెట్లను సచివాలయాలు, బ్యాంకులతోపాటు, ఆన్లైన్లో కూడా విక్రయించాలని సూచించారు. సిరిమాను ఉత్సవాలను నేరుగా తిలకించేందుకు సామాన్య భక్తులను అనుమతించడమే కాకుండా, గతంలో లాగే వీధుల్లో ఎల్ఇడి తెరలను ఏర్పాటు చేసి, ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి సిరిమానోత్సవానికి సమిష్టిగా విజయవంతం చేయాలని, దీనికి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ ఏడాది సామాన్య భక్తులను అనుమతించాలని ఆదేశించారు. చాలా కాలంగా విజయనగరం ఉత్సవాలు, సిరిమానోత్సవంలో ఒక భాగంగానే జరుగుతున్నాయని చెప్పారు.
అక్టోబరు 9,10,11 తేదీల్లో జరిగే విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికను రూపొందించాలన్నారు. సైన్స్ఫెయిర్, ఫ్లవర్ షోలతోపాటు, సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేయాలన్నారు. అక్టోబరు 10,11 తేదీల్లో జరిగే పైడితల్లి సిరిమాను సంబరానికి అత్యంత పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలని, భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు.
భక్తులపట్ల దురుసుగా ప్రవర్తించవద్దని పోలీసులకు సూచించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొనేందుకు సర్వ దర్శనంతోపాటుగా,100, 300 క్యూలైన్లను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది కూడా విఐపి పాసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ముందు స్తు మీటింగ్ లో కాపుగంటి ప్రకాష్, డాక్టర్ విఎస్ ప్రసాద్, ఎస్ఎస్ఎస్ఎస్ విఆర్ఎం రాజు, డోల మన్మధకుమార్, మేకా అనంత లక్ష్మి తదితర ఉత్సవ కమిటీ జీవితకాల సభ్యులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిరిమానోత్సవ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎంఎల్ఏలు శంబంగి వెంకట చినప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, అలజంగి జోగారావు, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, జిల్లా ఎస్పి దీపిక, జెసి మయూర్ అశోక్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.