భారత్ లోని కేరళ నుంచి సౌదీ అరేబియాలోని హజ్ కు కాలినడకన వెళుతున్న వ్యక్తి కోరిన విధంగా ట్రాన్సిట్ వీసా ఇవ్వాలని పాకిస్తాన్ కు చెందిన ఒక వ్యక్తి ఆ దేశ సుప్రీంకోర్టును కోరారు. కేరళలోని తన సొంత పట్టణం నుంచి షిహాబ్ చోటూర్ అనే వ్యక్తి 8,640 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి హజ్ లో ప్రార్ధనలు చేయాలని తలచాడు. ఈ ప్రయాణంలో అతను పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్ మరియు కువైట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
29 ఏళ్ల ఈ భారతీయ పౌరుడు ఇప్పటికే 3,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వాఘా సరిహద్దు వరకూ చేరుకున్నారు. అక్టోబర్లో ఆయన అక్కడకు చేరగానే వాఘా సరిహద్దులో పాకిస్థాన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. తాను కాలినడకన హజ్ యాత్రకు వెళ్తున్నానని, మానవతా దృక్పథంతో దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతించాలని షిహాబ్ ఇమ్మిగ్రేషన్ అధికారుల ముందు తన కోరికను ఉంచాడు.
ఇరాన్ మీదుగా సౌదీ అరేబియా చేరుకోవడానికి తనకు ట్రాన్సిట్ వీసా కావాలన్నాడు. అయితే అధికారులు అనుమతించకపోవడంతో అతడి కి ‘ట్రాన్సిట్ వీసా’ ఇవ్వాలని కోరుతూ పాకిస్తాన్ పౌరుడు లాహోర్ నివాసి సర్వర్ తాజ్ లాహోర్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశాడు. భారతీయ పౌరుడి పూర్తి వివరాలను పిటిషనర్ ఇవ్వలేదని, పైగా పిటిషనర్ ఆ భారతీయ ప్రయాణీకుడికి బంధువు కూడా కాదని చెబుతూ లాహోర్ హైకోర్టు అతడి పిటిషన్ ను కొట్టేసింది.
దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన లాహోర్ హైకోర్టు నిర్ణయాన్ని పాకిస్థాన్ వ్యక్తి బుధవారం సుప్రీంకోర్టులో సవాలు చేశాడు. ఈ భారతీయ పౌరుడు హజ్ కోసం సౌదీ అరేబియాలోని మక్కాకు వెళ్లేందుకు పాకిస్థాన్లోకి ప్రవేశించాలనుకున్నాడని, గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా మరియు ఇతర సందర్భాలలో దేశంలోని పవిత్ర స్థలాలను సందర్శించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో భారతీయ సిక్కులకు వీసాలు మంజూరు చేస్తుందని అదే విధంగా ఈ భారతీయ పౌరుడికి కూడా ట్రాన్సిట్ వీసా ఇవ్వాలని తన పిటిషన్లో వాదించారు.
అదే విధంగా హజ్ కోసం కాలినడకన సౌదీ అరేబియా చేరుకోవాలనుకునే భారతీయ ముస్లింకు (ట్రాన్సిట్) వీసా ఇవ్వాలని ఆయన అన్నారు. లాహోర్ హైకోర్టు డివిజన్ బెంచ్ షిహాబ్ దాఖలు చేసిన తాజ్ అప్పీల్ను కొట్టివేసింది. ‘పిటిషనర్కు భారతీయ పౌరుడు బంధువు కాదు, న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు కూడా అతనికి లేదు’ అని కూడా కోర్టు పేర్కొంది.