భారత దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్నది. పాకిస్తాన్ లో ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తూ శాంతి భద్రతలకు భారత్ విఘాతం కలిగిస్తున్నదనడానికి తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వెల్లడించారు.
ఈ మేరకు ఆయన పాకిస్తాన్ మిలిటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ తో కలిసి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ సమాజం భారత్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పాకిస్తాన్ లో భారత్ ఉగ్రవాదాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నదని, అందుకోసం ఇక్కడి ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నదని వారన్నారు.
పాకిస్తాన్ లో తిష్ట వేసి ఉన్న ఉగ్రవాదులకు భారత్ ఆయుధాలను సమకూరుస్తున్నదని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పాకిస్తాన్ ప్రకటించింది. ఐక్య రాజ్యసమితి తో బాటు అన్ని దేశాలూ తమ వాదన విని భారత్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని పాకిస్తాన్ కోరింది.
జమాత్ ఉల్ అహరార్, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, తెహరీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థలను ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిందని, ఈ సంస్థలకు భారత్ ఆయుధాలను, నిధులను సమకూరుస్తున్నదని పాకిస్తాన్ తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాద శిబిరాలను భారత్ పోషిస్తున్నదని పాకిస్తాన్ ఆరోపించింది. అక్కడి ఉగ్రవాద శిబిరాలకు బలం చేకూర్చి పాకిస్తాన్ లో అస్థిరత్వాన్ని సృష్టిస్తున్నదని వారన్నారు.