జమ్మూ కాశ్మీర్ లో ఇతర రాష్ట్రాల వారికి నివాస ధృవీకరణ పత్రాలు ఇస్తూ భారత ప్రభుత్వం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నదని పాకిస్తాన్ ఆక్షేపించింది. కాశ్మీర్ లో శాశ్వత నివాసం ఉండేందుకు వీలుగా భారత ప్రభుత్వం ఈ విధంగా ధృవీకరణ పత్రాలు ఇవ్వడం వెనుక హిందూత్వ ఎజెండా ఉందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆయేషా ఫారూఖీ తెలిపారు.
ముస్లింలు మెజారిటీగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మే 18 నుంచి ఇప్పటి వరకూ దాదాపుగా 25 వేల మంది స్థానికేతరులకు నివాస పత్రాలను భారత ప్రభుత్వం అందచేసిందని పాకిస్తాన్ వెల్లడించింది. స్థానికులకు రిజర్వు అయి ఉన్న ఉద్యోగాలకు వీరంతా కూడా అర్హులు అవుతారని, తద్వారా కశ్మీరీల స్వయం ప్రతిపత్తి పోతుందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఐక్యరాజ్యసమితి నియమ నిబంధనలకు ఇది విరుద్ధమని పాకిస్తాన్ ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ చేస్తున్న ఈ పనులు తీవ్ర ఆక్షేపణీయమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆయేషా ఫారూఖీ తెలిపారు.