అత్యంత కీలకమైన మనీ లాండరింగ్ బిల్లును పాకిస్తాన్ ఎగువ సభ తిరస్కరించింది. పాకిస్తాన్ లో మనీ లాండరింగ్ చట్టం ఇప్పటి వరకూ లేకపోవడంతో ప్యారిస్ కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ దేశాన్ని 2018లో గ్రే లిస్టులో పెట్టింది.
2019 లోపు మనీ లాండరింగ్ ను నిషేధించకపోతే బ్లాక్ లిస్టులోకి మారుస్తారు. అయితే ఈ గడువును కరోనా నేపధ్యంలో పెంచారు. ఈ లోపు బిల్లును ఆమోదించుదామని ప్రయత్నించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నాలు ఫలించలేదు.
ఎఫ్ఏటిఎఫ్ సూచనల మేరకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం యాంటీ మనీ లాండరింగ్ బిల్లు, ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ వక్ఫ్ ప్రాపర్టీస్ బిల్లులను తీసుకువచ్చారు. ఈ రెండు బిల్లులను తనకు మెజారిటీ ఉన్న జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పాస్ చేయించుకున్నారు.
అయితే ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న సెనేట్ లో బిల్లులను తిరస్కరించారు. ప్రతిపక్షాలు తమ వద్ద ఉన్న అక్రమ సంపాదనను కాపాడుకోవడానికే బిల్లలకు మద్దతు ఇవ్వలేదని ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశాలలో కూడా ప్రతిపక్షాలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయని ఆయన అన్నారు. త్వరలో ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి రెండు బిల్లులు ఆమోదం పొందే విధంగా చేసుకుంటామని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.