రాష్ట్ర ప్రభుత్వం మొండిగా సహాయ నిరాకరణ చేయడంతో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన నామినేషన్ల ప్రక్రియ ఆలశ్యం కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయితీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేశారు. మెుదటి విడత జరగాల్సిన ఎన్నిక నాలుగువ విడతగా ఆయన మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది.
ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్రాయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని.. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వాయిదా వేశారని రోహత్గి కోర్టుకు విన్నవించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. పోలీసులు వ్యాక్సిన్ భద్రతలో ఉన్నారని వివరించారు.
రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారని రోహత్గి తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం 5 లక్షల మంది సిబ్బంది అవసరమవుతారని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని వెల్లడించారు. దీనిపై వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది.