సర్పంచ్ భర్తతో ఎదురవుతున్న ఇబ్బందులు తాళలేక ములుగు పంచాయతీ సిబ్బంది ధర్నాకు దిగారు. జిల్లా కేంద్రంలోని ములుగు మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణ ముందు పంచాయతీ సిబ్బంది ధర్నాకు దిగడంతో ఉన్నతాధికారులు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. గ్రామ సర్పంచ్ భర్త హరినాదం వ్యవహరిస్తున్న తీరుతో తాము విసిగిపోయామని, ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనోవేదనకు గురై ధర్నాకు దిగామని పంచాయతీ సిబ్బంది వెల్లడించారు.
కార్యదర్శి అనుమతి లేకుండా, కనీసం సమాచారం లేకుండా అనధికారికంగా సర్పంచ్ భర్త హరినాదం చెప్పిన మాటతో ప్రహరీ గోడ కూల్చివేయడానికి వెళ్ళిన సిబ్బందిపై ఇంటి యజమాని గొడవకు దిగి, క్రిమి సంహారక మందు సేవించడానికి సిద్ధమైన సంఘటనతో వేరే గత్యంతరం లేక ధర్నాకు దిగే పరిస్థితి వచ్చిందని పంచాయతీ సిబ్బంది ఆవేదన వ్యక్తంచేశారు.
ధర్నాకు దిగిన పంచాయతీ సిబ్బందితో డీ పీ ఓ మాట్లాడుతూ కార్యదర్శి కి సమాచారం లేకుండా సర్పంచ్ భర్త హరినాదం ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పంచాయతీ సిబ్బందిని పురమాయించడం సరైంది కాదని అన్నారు. ఇక నుండి ములుగు సర్పంచ్ భర్త , ఉప సర్పంచ్ భర్త యజమాయిషి లేకుండా పంచాయితీ కార్యదర్శి శంకరయ్య ఆదేశాల ప్రకారమే పనిచేయాలని, సర్పంచ్ భర్త , ఉప సర్పంచ్ భర్త తీసుకునే నిర్ణయాలు ఇకనుండి చెల్లవని ఇప్పటికైనా వారి పద్ధతులను మార్చుకోవాలని ఘాటుగా సూచించారు.
ములుగులో జరిగిన సంఘటన తీరుతో తీవ్రంగా చలించిపోయిన డిపిఓ జిల్లా స్థాయిలో మహిళా సర్పంచులు ఉప సర్పంచుల భర్తలు పాలన అధికారం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఆదేశాలు సైతం జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బంది డీ పీ ఓ తో మాట్లాడుతూ ఒకరోజు పనికి రాకపోతే రెండు మూడు రోజుల వేతనం సర్పంచ్ భర్త కట్ చేస్తున్నారని, ఎదురు తిరిగి అడిగితే పని నుంచి తీసి వేస్తామని బెదిరించడంతో మానసికంగా కుంగి పోతున్నామని తెలుపడంతో ఇక నుంచి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా సద్దుమణిగింది.
ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే నా దృష్టికి తీసుకు రావాలని అన్నారు. ఈ ధర్నాలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.