సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవలు, ఆర్ట్ ,క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులకు, కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న పొరుగు సేవల ఉపాధ్యాయులకు, కే.జీ.బీ.వీ ఇంటర్మీడిట్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ఒప్పంద పొరుగు సేవల గౌరవ అధ్యక్షులు డాక్టర్ గుండబాల మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష విభాగంలో ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక పద్ధతిలో ఆర్ట్ , క్రాఫ్ట్ ,వ్యాయామ విద్య బోధకులను పని చేస్తున్నారు. అయితే వీరికి నాలుగు సంవత్సరాల నుంచి 14, 203/- రూపాయలు గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బట్టి 25, 000/- వరకూ ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులు తమ పిల్లలను ఇప్పటికే జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీలకు పంపించినా ఎటువంటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి అందడం లేదు. అలాగే ప్రతి ఏడాది బడి మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించే కార్యక్రమంలో చరుకుగా పాల్గొని ముఖ్య పాత్ర పోషించినా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందింవ్వడం లేదు.
అలాగే కే.జీ.బీ.వీ ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా అధ్యాపకులకు కేవలం నెలకు 12,000/- గౌరవ వేతనం ఇస్తున్నారు. కొన్ని జిల్లాల్లో గతంలో పనిచేసిన కొంతమంది గెస్ట్ అధ్యాపకులను కూడా కేవలం ఐదు నెలలకి ఉద్యోగం ఉంటుందని చెప్పి నెలకు 10, 000/- రూపాయలు మాత్రమే జీతం చెల్లిస్తున్నారు.
ఈ గెస్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత లేదు. కే. జీ. బీ. వీ. అధ్యాపకులకు వారానికి కొన్ని రోజుల్లో 24 గంటలు కళాశాలలో పని చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు 37, 000 నెలకు జీతం ఇస్తున్నారు.
ఒక పని ఒకే విధంగా చేస్తున్నా రెండు విభాగాల్లో పని చేస్తున్న వారికి వ్యత్యాసం చూపిస్తున్నారు. తాత్కాలిక కే. జీ. బీ. వీ అధ్యాపకులు రోజు పాఠశాలకు, కళాశాలలకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా పనిచేస్తున్నప్పటికీ, ఉద్యోగం వచ్చేసరికి పార్ట్ టైమ్ అని చెప్పి వీరి చేత వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు.
ఇప్పటికైనా పార్ట్ టైం అనే పదం తొలగించి ఫుల్ టైం క్రింద మార్చి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.