ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావాలని ఎక్కువ మంది కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మంత్రి వర్గం నుంచి అత్యంత అవమానకర పరిస్థితుల్లో బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గం అయిన హుజూరాబాద్ లో కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
మంత్రి పదవి నుండి బర్తరఫ్ అయిన తర్వాత భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి వచ్చిన ఈటెల నిన్న, ఈరోజు తన క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలతో భవిష్యత్ కార్యాచరణ పై చర్చిస్తున్నారు. ఎన్ ఆర్ ఐ లతో సైతం చర్చించారు.
హుజూరాబాద్ లో ఈటెల కార్యకర్తలతో చర్చిస్తున్న సమయంలోనే కొంత మంది సెకండ్ క్యాడర్ నాయకులతో జిల్లా మంత్రులు మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భారీ ఎత్తున వచ్చారు.
ఆత్మాభిమానం చంపుకుని పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని, మీరు సరైన నిర్ణయం తీసుకుని బయటకు వస్తే మిమ్మలన పార్టీల కతీతంగా గెలిపిస్తా మని ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నారదాసు లక్ష్మణరావు, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు సీఎం కు ఈటెల కు సయోధ్య కుదుర్చుతారని అందరూ అనుకున్నారు అయితే వారు ఈ రోజు హైదరాబాద్ లో విలేకరుల సమావేశం పెట్టి ఈటెలపై ఎదురు దాడి చేశారు.
ఇవి అన్నీ సీఎం కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. జిల్లా కేంద్రంలో ఉండి మంత్రులు చక్రం తిప్పాలని భావిస్తూ తెరాస లోని కొంతమంది నాయకులకు ఎరవేసి లాగాలనుకుంటున్నారు.
అయితే ఇక్కడ మాత్రం పరిస్తితి ఇందుకు భిన్నంగా ఉంది. ఒకవేళ ఈటెల రాజీనామా చేస్తే ఆయనతో పాటు నియోజకవర్గం లోని సెకండ్ క్యాడర్, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఛైర్పర్సన్ లు,కౌన్సిలర్స్, సర్పంచ్ లతో సహా వివిధ రకాల పదవుల్లో ఉన్నవారు తమ రాజీనామా చేయకపోతే ఈటెల అభిమానులు, కార్యకర్తలు ఊరుకునెట్లు కనిపించడం లేదు.
రాజీనామా చేయని వారిని గ్రామాల్లోకి రానివ్వం అని సమావేశం లోనే తేల్చి చెబుతున్నారు. దీనిని బట్టి పరిస్తితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం అవుతుంది. ఏది ఏమైనా ఈటెల నిర్ణయం పై నే నియోజక వర్గ నాయకుల పదవులు ఆధారపడి ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు తెలుతుందో…వాయిదా పడుతూ ఉందో చూడాలి మరి.